Total Pageviews

Sunday 31 March 2013

కన్సర్వేటిజం - భారతదేశంలోని సోషలిజంలోని లొసుగులు - దేవాలయంలో దేవునిపైపోసిన పాలు..

కన్సర్వేటిజం - భారతదేశంలోని సోషలిజంలోని లొసుగులు - దేవాలయంలో దేవునిపైపోసిన పాలు..

ప్రజలందరూ కలిసి తమ రాజ్యాన్ని నడుపుకోవడానికి కొంతమంది మనుషులని పనివారుగా జీతభత్యాలు ఇచ్చి పనిలో పెట్టుకుంటారు. వీళ్లనే మీరు గవర్నమెంటు ఆఫీసుల్లో చూస్తుంటారు. అంతేకాకుండా తమకు అవసరమైన విషయాలపై చట్టాలుచేసేటందుకు, తము నియమించిన పనివారు గవర్నమెంటు ఆఫీసుల్లో వారి పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో చూసుకోవడానికి చట్టసభలకు కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులే ఎమ్మెల్లేలుగా ఎంపీలుగా మనకు కనబడుతుంటారు. వీళ్లే అధికారిక కమిటీ చైర్మన్లుగా ప్రజల తరఫున వ్యవహారాలు నిర్వహిస్తుంటారు.


అయితే దీనికంతటికీ ఖర్చు అవుతుంది.... ఈ ఖర్చులే మనం పన్నులరూపంలో చెల్లిస్తుంటాము. అలాగే ఖనిజాల ఎగుమతిగూడా చేసి డబ్బులు సంపాదించి ప్రజలు తమబాగోగులు తాము చూసుకుంటుంటారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి వందరూపాయలు సంపాదిస్తుంటే, అతడు కట్టే వందరూపాయల్లో నలభైరూపాయలు గవర్నమెంటుని పోషించడానికి అంటే అతనికింద ’భారతదేశం అంతటా’ పనిచేస్తున్న పనివారికి, అలాగే అతను నియమించిన ఎమ్మెల్లేలకు ఎంపిలకు ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన అరవై రూపాయల్లో అతను తన బిడ్డలకు పాలు పోషకాహారము చదువు అందించి తాను తిని, తనను సుఖంగా చూసుకుంటుంన్నందుకు తన దేవుడిపై కొంత ఖర్చుపెడతాడు... అయితే దేవాలయాల్లో పాలుపోస్తున్నంతమాత్రాన అది బాధ్యతా రాహిత్యం గాదు.

ఇకపోతే ఆ నలబైరూపాయలు సంపాదిందిన గవర్నమెంటు ఏంచేస్తోందో చూద్దాము. ఆ డబ్బుని ఏ పిల్లలకైతే అవసరమో ఆ పిల్లలందరికీ సమానంగా పంచాలి. కానీ అలా పంపిణీ జరగదు. అంటే కులప్రాతిపదికమీదమాత్రమే పంపకం జరుగుతుంది. నిరుపేద బ్రాహ్మణుడి పిల్లలకు పాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోదు... కానీ పన్నులుమాత్రం అందరినుండీ సమానంగా సంపాదిస్తుంది.... ఇది సోషలిజంలోని లొసుగు. అంటే ప్రజలు మేమందరమూ సమానంగా పన్నులు కడుతున్నపుడు మా పిల్లలందరికీ సమానంగా ఎందుకు న్యాయం జరగడంలేదు అని అడగలేని నిస్సహాయస్థితిని సోషలిజం కలిగిస్తుంది.

మనం కట్టిన ఆ నలభైరూపాయల పన్నులో ఒక వెయ్యిమంది గవర్నమెంటు ఆఫీసుల్లో పనిచేస్తున్నారనుకోండి వాళ్లకు జీతాలు ఇవ్వాలి. వాళ్లు పనిచేసినా చెయ్యకపోయినా వాళ్లకు సదుపాయాలు అందించాలి. పైగా అక్కడగూడా కులాలప్రాతిపదికమీదే ఉద్యోగనియామకాలు జరుగుతాయి. ఎంతమంది పనివారు ఉంటే అంత ఖర్చు అవుతుంది. సోషలిజంలోని ప్రభుత్వాలలో ఇది రెండవ లొసుగు. అంటే అతి ఎక్కువమందిని పనిలో పెట్టుకుని వాళ్లకు జీతభత్యాలు అందిస్తుంటారు, పని ఉన్నాలేకపోయినా సరే! దానివల్ల ప్రజలు కట్టాల్సిన పన్నుల బాధ్యత పెరుగుతుంది. ఇది ఎంతదూరం వెళుతుందంటే సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రూపంలో ప్రభుత్వం చెప్పే లెక్కలు చూడడమేతప్ప ఇంత డబ్బు నేను ఎందుకు కట్టాలి? అని అడగలేని నిస్సహాయస్థితిని సోషలిజం కల్గిస్తుంది.

ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నదేంటంటే గవర్నమెంటువారు మీవద్ద నడ్డి విరగ్గొట్టి పన్ను వసూలు చేస్తారు, పైగా పిల్లలకు సదుపాయాలు అందించరు. ఎక్కువమంది ప్రజలు ప్రభుత్వంలో పనిచేస్తూ అధికారాన్ని తమకింద ఉంచుకుంటారు, వీళ్లని నడిపిస్తూ కొంతమంది అత్యంత ఎక్కువ అధికారం కలిగిన నియంతలు పనిచేస్తుంటారు. ఆ పనిచేసేవారు లంచగొండులుగా మారినపుడు, ఆ నియంతలకు ప్రజల బాగోగులు పట్టనప్పుడు దేశంలో పిల్లలు ఆకలితోను సౌకర్యాలు లేక మరణిస్తారు. పేదలు మరింత పేదలుగా మారతారు. రష్యాలో సోషలిజం పతనం దీనివల్లే జరిగింది.... ఎక్కువమంది ప్రభుత్వాలలో పనిచేస్తూ ప్రజలనుండి పన్నులను వసూలుచేస్తూ ప్రజల బాగోగులను మర్చిపోయారు.

ప్రజలు కట్టిన పన్నులు సక్రమంగా పంపిణీచెయ్యడమే ప్రభుత్వంయొక్క బాధ్యత.... కానీ ఆ బాధ్యత ప్రభుత్వం చెయ్యలేనపుడు సోషలిజాన్ని తగ్గించి వ్యక్తి స్వాతంత్య్రాన్ని పెంచడం మంచిది. అంటే ఒక వ్యక్తిగా నాకు నచ్చిన పద్ధతిలో నేను దానధర్మాలు చెయ్యడానికి నా చుట్టుపక్కలవారి బాగోగులు చూసుకోవడానికి నాకు స్వతంత్య్రం ఉండాలి.... అంటే నాపైన పన్నులభారం అతి తక్కువగా ఉండాలి..... బలవంతంగా నానుండి పన్నులు వసూలు చేసి నాకు నచ్చని వ్యవహారాలపై ఖర్చుపెడితే నేను ప్రతిఘటించే అవకాశం నాకు ఉండాలి. దీన్నే ఇతరదేశాలలో కన్సర్వేటిజం అంటారు. వ్యక్తికి ఆలోచించే స్వేచ్చమాత్రమేగాదు, తన ఆలోచనలను ఆచరణలో పెట్టగల విత్తంగూడా అతనివద్ద ఉండాలి.

కన్సర్వేటిజం ఆలోచన ప్రకారం ఎంత తక్కువమంది పనివారు ప్రభుత్వంలో ఉంటే అంత మంచిది. దానివల్ల ప్రజలు కట్టాల్సిన పన్నులు తగ్గుతాయి. అంటే నలభైరూపాయల పన్ను బదులుగా ఇరవైరూపాయల పన్నుమాత్రమే అవసరం అవుతుంది. ఆ మిగిలిన ఇరవై రూపాయలను వ్యక్తి తనకు తోచిన రీతిలో తాను దానధర్మాలు చేయచ్చు. అంటే నాకు నా పిల్లల చదువుకు మంచి స్కూలు కావాలని ఉంది అనుకోండి. గవర్నమెంటుకు నేను అప్పటికే ఎంతో ఎక్కువ డబ్బు ఇచ్చేసి ఉంటాను ’స్కూలు కట్టించండి’ అని. కానీ వారు కట్టరు ఎందుకంటే టెండర్లు, రిజర్వేషన్లు, మన్ను, మశానం అని వాళ్లు కట్టించేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది... అప్పటిక్ నా పిల్లలు పెరిగి పెద్దవారయిపోయి ఉంటారు. అలాకాకుండా నేను గవర్నమెంటుమీద ఆధారపడకుండా స్కూలు కట్టుకున్నాననుకోండి దానివల్ల నాకు వెంఠనే సదుపాయం అవుతుంది.


వ్యక్తులు ఆనందంగా ఉంటేనే సక్రమంగా పనిచేయగలుగుతారు. వ్యక్తులు స్వేఛ్ఛగా ఉన్నప్పుడే స్వేఛ్ఛాపూరితమైన ఆలోచనలు చెయ్యగలుగుతారు. స్వేచ్చగా నివసించే మానవుడు మాత్రమే తోటి మానవుని స్వేచ్చగురించి వ్యక్తిగత బాధ్యత స్వీకరించగలుగుతాడు. అటువంటి వ్యక్తి స్వేచ్చని సోషలిజం పేరుతో హరించేస్తే ఆ మానవుడు తాను నివసించే సమాజంపై తనకుగల వ్యక్తిగత బాధ్యతను పక్కనబెట్టి ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడతాడు. అంటే స్కూలు కట్టించాలన్నా బావితవ్వించాలన్నా గవర్నమెంటు సహాయం, వాళ్ల అనుమతి, వాళ్ల లెక్కలు అడుగుతుంటాడు. ఈవిధంగా సోషలిజంలో తన స్వేచ్చని కోల్పోయి ప్రభుత్వానికి కట్టుబానిసగా మారతాడు. అంటే సాలెపురుగు తాను కట్టుకున్న గూటిలో తానే చిక్కుకున్నట్లుగా, సోషలిజంలో నివసించే వ్యక్తి తనకోసం తనబాగోగులకోసం తను నియమించుకున్న వ్యక్తులచేతుల్లో (ప్రభుత్వాధికారుల చేతుల్లో) తానే బందీగా మారతాడు.... దీనికి ఒక్కటే మార్గం. ప్రభుత్వాన్ని తగ్గించడం ఎంత తక్కువ ప్రభుత్వం ఉంటే అంత మంచిది.... దీన్నే కన్సర్వేటిజం అంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఎక్కువమంది కన్సర్వేటివ్ లు ఉండేవారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని అధికారకమిటీలో ఒక్క జవహర్ లాల్ నెహ్రూ తప్పనించి మిగిలినవారందరూ కన్సర్వేటివ్ లుగా ఉండేవారని వారి ఆలోచనా ధోరణివల్ల మనకు తెలుస్తుంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అలాగే దాదాభాయ్ నౌరోజి ఆ కాలంలో చాలా పేరుమోసిన కన్సర్వేటివ్ లు. కానీ నెహ్రూ మాత్రం దేశాన్ని సోషలిజంవైపు ప్రభుత్వనియంతృత్వంవైపు నడిపించాడు. ఇది భారతదేశపు దురదృష్టం.


ఉదాహరణకు అజ్మల్ కసబ్ ను పోషించడానికి ప్రభుత్వం ఇరవైకోట్లు ఖర్చుపెట్టిందట! ఆ ఇరవైకోట్లు ఎక్కడనుండి వచ్చాయి? ప్రజలు కట్టిన పన్నులనుండే ఖర్చుపెట్టాలిగదా? మరి ఆ పన్నులలోనుండి ఇరవైకోట్లు అజ్మల్ కసబ్ పై ఖర్చుపెట్టమని ఏ ప్రజలు చెప్పారు?! అంటే ప్రజల తరఫున ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఖర్చుపెడుతుంది. కానీ చిక్కల్లా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా నిర్ణాయాలు తీసుకోవడంలోనే వస్తుంది. అంటే ఎక్కడ నిజంగా ఖర్చుపెట్టాలో అక్కడ ఖర్చుపెట్టాలి. పసిపిల్లలకు పాలు పొయ్యడానికి వాళ్లపై ఆ ఇరవైకోట్లు ఖర్చుపెట్టిఉంటే బాగుండేది.... కానీ అజ్మల్ కసబ్ పై ఖర్చుపెట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది సోషలిజంలోని అంతర్లీనమైన ఇంకొక లొసుగు.

అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా సోషలిజం పేరుతో నడ్డి విరగ్గొట్టే పన్నులు వేసి, పైగా ప్రజలకింద పనిచేసే పనివారు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని లంచగొండులుగా మారుతుంటే అరికట్టే కార్యక్రమాలు చేపట్టకుండా "నేను సోషలిష్టుని కాదు" అని చెప్పే ఏ వ్యక్తిని ఏ రాజకీయపార్టీని ప్రభుత్వానికి పోటీపడకుండా చట్టాలలో మార్పులు తెచ్చింది. అందువల్ల ఇప్పుడు భారతదేశపు ఎన్నికల్లో పోటీచేసే ప్రతి రాజకీయపార్టీ ’సోషలిష్టు’ పార్టీ మాత్రమే. ’నేను సోషలిజాన్ని సమర్ధిస్తాను’ అని చెప్పి సంతకం పెట్టందే ఏ వ్యక్తీ చట్టసభకు ఎన్నికకావడానికి వీలులేదు. ఎన్నికలదరఖాస్తుపత్రంలో ’నేను సోషలిష్టుని’ అని ఒక టిక్ బాక్స్ ఉంటుంది గమనించండి....

కాబట్టి దేవుడిని నమ్మడం ఆయనపై పాలుపొయ్యడం భక్తి.... కానీ ఆ భక్తుడిని అనేకవేలమంది పసిపిల్లలు చనిపోతుంటే నీకు భక్తి ఎక్కువైందా అని ప్రశ్నించడం ఆ ప్రశ్నించే వ్యక్తి బాధ్యతా రాహిత్యమే.... ’ఏం నేను కట్టే పన్నులను ఏంచేస్తున్నావు? నావద్ద ఏవిధమైన విత్తంలేకుండా నావద్ద ఉన్నదంతా పన్నురూపంలో సోషలిష్టు రూపంలో దోచుకుంటూ పైగా నా విశ్వాసాన్నిగూడా నాకు లేకుండా చేస్తావా?!’ అని అడగలేని నిస్సహాయస్థితిలో ఈనాడు దేశం ఉంది... -మాధవ తురుమెళ్ల, లండన్, 31-మార్చి-2013

1 comment: