Total Pageviews

Monday 16 January 2012

దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు

భగవద్గీత లో పదహారవ అధ్యాయం చాలా ముఖ్యమైనది.. దీన్ని నేను రోజూ రైల్లో నా ఆపీసుకు వెళ్లుతున్నప్పుడు స్మరణకు తెచ్చుకుంటాను. దీంట్లో దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు చెప్పాడు.

శ్రీకృష్ణుడు దైవగుణాలు అంటే ఏంటో ఇలా చెప్పాడు:
భయం లేకుండడం,నిర్మలమైన మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, [ఇతరులలో] దోషాలు ఎంచకుండడం, [జీవులపట్ల] మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీర్తిపట్ల ఆశ లేకుండడం.

కానీ ఆ తర్వాత గీతలో భగవానుడు చెప్పిన ఆసుర లక్షణాలే నన్ను నిజంగా వణికింపజేస్తాయి..

ఇదమ్ అద్య మయా లబ్ధమ్ ఇమమ్ ప్రాప్స్యే మనొరథమ్
ఇదమ్ అస్తిదమ్ అపి మే భవిష్యతి పునర్ ధనమ్ ||
అసౌ మయా హతః శతృః హనిష్యేచా పరాన్ అపి
ఈశ్వరోహం అహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ ||
ఆఢ్యోభి జనవాన్ అస్మి కోన్యోస్తి సదృశో మయా
యక్షేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః ||

మూర్ఖులు అజ్ఞాన విమోహితులు --- "ఇది నాకు దొరికింది. దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఆస్తి ఉంది,ఇంకా ఆస్తి పోగేసుకుంటాను. ఈవేళ (చూడు నేను) ఈ విధంగా నా శత్రువును చంపాను! ఇక మిగిలిన శత్రువులందరినీ చంపుతాను (వ్యాపారంలో శతృత్వమే కావచ్చు). నాదగ్గర సర్వమైన అధికారాలున్నాయి. నేను చాలా బలవంతుడిని, నేను చాలా సుఖపడేవాడిని, నా దగ్గర బోల్డంత డబ్బుంది (ధనికుడిని), నేను తలచుకుంటే నాకిక ఎదురే లేదు, నాకు ఎవరూ సమానం కాదు, నేనే యాగలూ,దానాలూ చేస్తాను. నేనెప్పుడూ సంతోషినే" --- అని అజ్ఞానంచేత అనుకుంటూ కామం, భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.

ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ మూర్ఖులు పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి తోటివారిపట్ల అసూయతో పడి కొట్టుకుపోతూ అంతర్యామి నైన [అంతరాత్మను] నన్ను తిరస్కరిస్తారు. వీరు తిరిగి తిరిగి ఇలాంటి పాపపు జన్మలే పొందుతారు. వీరు ఎన్నటికీ నన్ను చేరలేక [అమూల్యమైన మనుష్యజన్మని వ్యర్ధం చేసుకుని] అంతకంతకూ హీనజన్మలనే [పురుగు పుట్ర, సంక్రాంతి కోళ్లలాగా కొట్టుకునే జన్మలని] పొందుతుంటారు.

No comments:

Post a Comment